ఉత్తరాంధ్ర ఉద్యమ అక్షర సేనాధిపతి: సీఎం జగన్
ABN , First Publish Date - 2020-08-05T08:54:49+05:30 IST
‘‘జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘పామును పొడిచిన చీమలున్నయట’ అంటూ ఉత్తరాంధ్ర
- అణగారిన వర్గాలను చైతన్యపరిచిన ప్రజాకవి: చంద్రబాబు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): ‘‘జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘పామును పొడిచిన చీమలున్నయట’ అంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు’’ అంటూ సీఎం జగన్మోహన్రెడ్డి వంగపండును స్మరించుకొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేస్తూ... ‘‘అణగారిన వర్గాలలో చైతన్యం కలిగించిన ప్రజాకవి ఆయన . జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వంగపండు మృతి సాహితీలోకానికి తీరని లోటు’’ అని సంతాపం ప్రకటించారు. వంగపండు తన స్వరాన్ని భాస్వరంగా మార్చిన ప్రజాగాయకుడు అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వంగపండు మరణం తనను కలిచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో... వంగపండు మృతి తనను ఎంతో బాధించిందని తెలిపారు. వంగపండు జానపద కవిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుపొందారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. ఆయన మృతి ఉద్దానం ప్రాంతానికి తీరని లోటని న్యూడెమొక్రసి నాయకుడు వంకల మాధవరావు అన్నారు.