నా ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నా
ABN , First Publish Date - 2020-10-27T08:58:24+05:30 IST
రాజధాని ప్రాంత రైతులపై తాజాగా పెట్టిన కేసులో మలుపు చోటుచేసుకుంది. కృష్ణాయపాలెం ఘటనలో ఫిర్యాదు చేసిన ఈపూరి రవి..

కృష్ణాయపాలెం కేసు ఫిర్యాదీ ఈపూరి రవి
మంగళగిరి, అక్టోబరు 26: రాజధాని ప్రాంత రైతులపై తాజాగా పెట్టిన కేసులో మలుపు చోటుచేసుకుంది. కృష్ణాయపాలెం ఘటనలో ఫిర్యాదు చేసిన ఈపూరి రవి, తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆమేరకు డీఎస్పీకి స్వయంగా లేఖను అందించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ యాక్టుతో ఫిర్యాదు చేయలేదు. కేసు వెనక్కు తీసుకుంటున్నానని డీఎస్పీకి లేఖ ఇచ్చాను. ఆ లేఖను కోర్టుకు అందజేస్తామని తెలిపారు’’ అని మీడియాకు చెప్పారు. ఈసందర్భంగా దళిత నాయకులు పిల్లి మాణిక్యాలరావు, చందోలు శోభారాణి, జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్, చిన్నా, చిలకా బసవయ్య, నియోజకవర్గ టీడీపీ నేత పోతినేని శ్రీనివాస్, వల్లూరి సూరిబాబు తదితరులు మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎంపీ నందిగం సురేశ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.