ఒత్తిళ్లకు లొంగకండి

ABN , First Publish Date - 2020-03-08T10:52:44+05:30 IST

‘‘రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సిబ్బంది అక్రమ మద్యాన్ని నిరోధించేందుకు పకడ్బందీగా పని చేయాలి.

ఒత్తిళ్లకు లొంగకండి

మద్యం, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయండి: వినీత్‌ బ్రిజ్‌లాల్‌


గుంటూరు, మార్చి 7: ‘‘రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సిబ్బంది అక్రమ మద్యాన్ని నిరోధించేందుకు పకడ్బందీగా పని చేయాలి. ఇసుక అక్రమ రవాణానూ కట్టడి చేయాలి. పోలీస్‌, ఎక్సైజ్‌, మైనింగ్‌ అధికారులు సమన్వయంతో వీటి కట్టడికి చర్యలు తీసుకోవాలి. ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. కఠినంగా వ్యవహరించాలి’’ అని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ స్పష్టంచేశారు. శనివారం గుంటూరులో 13జిల్లాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్‌అండ్‌వో డిఐజీ ఎస్‌వి రాజశేఖర్‌ బాబు, గుంటూరు అర్బన్‌ పోలీస్‌ అధికారి, డిఐజీ పీహెచ్‌డి రామకృష్ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కెఎల్‌ భాస్కర్‌, ఓఎ్‌సడీ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. తనిఖీల్లో పట్టుబడినవారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించరాదని వినీత్‌ ఆదేశించారు. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గద్దని స్పష్టం చేశారు. ఇసుకపై నిఘాకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ప్రాంతంలోని ఇసుక ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకూడదని డీఐజీ రామకృష్ణ తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను సీజ్‌ చేయాలన్నారు. డ్రైవరు, క్లీనర్‌లను అరెస్టు చేసి, ఓనర్‌పై చట్టప్రకారం కేసుపెట్టాలని సూచించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి శాండ్‌ విజిలెన్స్‌ యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న అంశంపై ట్రీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధి ప్రవీణ్‌కుమార్‌ వివరించారు. 

Updated Date - 2020-03-08T10:52:44+05:30 IST