ఈసీ గురించి తెలియని సీఎం.. ఏపీ దురదృష్టం
ABN , First Publish Date - 2020-03-16T08:52:36+05:30 IST
ఎన్నికల కమిషన్ అధికారాల గురించి తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను
- మొత్తం ప్రక్రియ రద్దు చేయాలి: కన్నా
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్ అధికారాల గురించి తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని కన్నా తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో పరిస్థితులు చేయిదాటినప్పుడు ఈసీ తన విస్తృత అధికారాలు ఉపయోగిస్తుందని గుర్తుచేశారు. ఈసీని తప్పుబడుతోన్న జగన్కు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయకూడదనే విషయం తెలియదా.? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడం పట్ల ఎన్నికల కమిషన్కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో జరుగుతోన్న దారుణాల గురించి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
జీవీఎల్ హర్షం: ఎన్నికల వాయిదాపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ లేబర్ బోర్డు ఛైర్మన్ జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు.