ఒక్కో కుటుంబంపై లక్షపైనే!

ABN , First Publish Date - 2020-10-01T07:49:03+05:30 IST

జగన్‌ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే రికార్డు స్థాయిలో అప్పులు చేసింది. ఇప్పటి వరకు అక్షరాలా రూ.1,30,000 కోట్ల రుణాలు తీసుకురాగా.. ఇంకా కొత్త అప్పుల కోసం ఆర్థిక శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది...

ఒక్కో కుటుంబంపై లక్షపైనే!

  • ఒక్కొక్కరిపై 26 వేల రుణభారం
  • 16 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులు

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే రికార్డు స్థాయిలో అప్పులు చేసింది. ఇప్పటి వరకు అక్షరాలా రూ.1,30,000 కోట్ల రుణాలు తీసుకురాగా.. ఇంకా కొత్త అప్పుల కోసం ఆర్థిక శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది.  రాష్ట్ర జనాభా 5 కోట్ల మందికీ ఈ అప్పులను సమానంగా పంచితే ఒక్కొక్కరిపై రూ.26,000 చొప్పున రుణభారం పడుతుంది. సగటున ఒక కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులుంటే ఆ కుటుంబంపై ఈ 16 నెలల్లో పడిన అప్పుల భారం అక్షరాలా రూ.1,04,000.


సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఈ 16 నెలల్లో సగటున రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పంచింది. పంచిన మొత్తంతో పోల్చితే.. పంచడం కోసం తెచ్చిన అప్పుల రూపంలో కుటుంబాలపై భారం ఎక్కువైంది. ప్రభుత్వ పథకాలకు అర్హులు కాని కుటుంబాలపై కూడా ఈ భారం పడుతుంది. ప్రభుత్వ చెల్లింపుల్లో మొదటి ప్రాధాన్యం అప్పుల తిరిగి చెల్లింపులు, వాటి వడ్డీలే. ఆర్‌బీఐ ఈ అప్పులు, వడ్డీలను మినహాయించుకున్నాకే మిగిలిన డబ్బును రాష్ట్ర ఖాతాకు బదిలీ చేస్తుంది. అంటే అప్పుల తర్వాతే ఏ ఖర్చయినా! ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అయినా, అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛన్లు అయినా,  నెలా నెలా ఇచ్చే రేషన్‌ సరుకులైనా అప్పులు, వడ్డీలు చెల్లించాక మిగిలిన డబ్బుతోనే ఇవ్వాల్సి ఉంటుందన్న మాట!


Updated Date - 2020-10-01T07:49:03+05:30 IST