వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ రావు కన్నుమూత
ABN , First Publish Date - 2020-10-04T22:20:17+05:30 IST
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ ఇవాళ మృతి చెందారు.
విశాఖ: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ రావు కన్నుమూశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ ఇవాళ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. అయితే దాన్నుంచి కోలుకున్నా.. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. విశాఖ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ద్రోణంరాజు శ్రీనివాస్... ప్రస్తుతం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్గా ఉన్నారు. వీఎంఆర్డీఏకు తొలి చైర్మన్గా ఆయన రికార్డులకు ఎక్కారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ తనయుడే శ్రీనివాస్ రావు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. శ్రీనివాస్ రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ద్రోణంరాజు మృతి పట్ల వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.