మాకు న్యాయం చేయండి!
ABN , First Publish Date - 2020-04-25T09:36:46+05:30 IST
న్యాయం చేయాలని కోరుతూ శాంతియుతంగా పోరు సాగిస్తున్నామని అమరావతి ప్రాంత రైతులు స్పష్టంచేశారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటిలా ఉందని మండిపడ్డారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే సాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 129వ రోజుకు

గుంటూరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): న్యాయం చేయాలని కోరుతూ శాంతియుతంగా పోరు సాగిస్తున్నామని అమరావతి ప్రాంత రైతులు స్పష్టంచేశారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటిలా ఉందని మండిపడ్డారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే సాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 129వ రోజుకు చేరాయి. రాజధాని ప్రాంత 29 గ్రామాల రైతులు, మహిళలు పలు రూపాల్లో నిరసన తెలిపారు. వారికి మద్దతుగా పొన్నెకల్లులో వరసగా ఆరో రోజు నిరసన దీక్షలు చేపట్టారు. రాజధాని మార్పుపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోరుతూ ‘అమరావతి వెలుగు’ కింద అమరావతి గ్రామాల్లో రాత్రి 7.30 గంటల నుంచి 5 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి రైతులు, మహిళలు తమ నిరసన తెలియజేశారు. గురువారం దళిత జేఏసీ నేత చిలక బసవయ్యను పోలీసులు నిర్బంధించినందుకు నిరసనగా తుళ్లూరుకు చెందిన మేరిగ మరియదాసు అంబేద్కర్ చిత్రపటంతో శుక్రవారం తన నివాసంలో దీక్ష చేపట్టారు.