ఢిల్లీలో ఏనాడైనా జగన్ మాట్లాడారా?: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-10-25T02:19:31+05:30 IST
జగన్ కేసులు భయంతో కేంద్రం చెప్పినదానికి తలాడించి పోలవరాన్ని ముంచారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఆ భయంతోనే అమరావతిని చంపేశారని...
విజయవాడ: జగన్ కేసులు భయంతో కేంద్రం చెప్పినదానికి తలాడించి పోలవరాన్ని ముంచారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఆ భయంతోనే అమరావతిని చంపేశారని.. ప్రత్యేకహోదాకు పాతరేశారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు టీడీపీ హయాంలోనే 70 శాతానికి పైగా పూర్తి అయ్యాయని చెప్పారు. టీడీపీ హాయాంలో రూ.12 వేల కోట్ల పైచిలుకు పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక్కశాతం పనికూడా జరగలేదని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్ను ఒక్క కాంట్రాక్టర్కే కట్టబెట్టారన్నారు. ఢిల్లీలో ఏనాడైనా జగన్ సీఎం హోదాలో పోలవరం గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. పోలవరం అంచనా కుదింపు విషయం ప్రజల్లోకి వెళ్లకూడదనే వైసీపీ పాలకులు అర్థరాత్రి గీతం విద్యాసంస్థపై దాడికి దిగారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.