బ్రహ్మయ్య అండ్ కో’ పార్టనర్ దేవినేని సీతారామయ్య కన్నుమూత
ABN , First Publish Date - 2020-07-20T08:06:46+05:30 IST
ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీ ‘బ్రహ్మయ్య అండ్ కో’ ప్రధాన భాగస్వామి, సీనియర్ ఆడిటర్ దేవినేని సీతారామయ్య(93) ఆదివారం హైదరాబాద్లోని..
![బ్రహ్మయ్య అండ్ కో’ పార్టనర్ దేవినేని సీతారామయ్య కన్నుమూత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి/విజయవాడ(విద్యాధరపురం), జూలై 19: ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీ ‘బ్రహ్మయ్య అండ్ కో’ ప్రధాన భాగస్వామి, సీనియర్ ఆడిటర్ దేవినేని సీతారామయ్య(93) ఆదివారం హైదరాబాద్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం తన్నేరుకు చెందిన ఈయన విజయవాడలోని బ్రహ్మయ్య కంపెనీ ప్రధాన భాగస్వామిగా గుర్తింపు పొందారు. అదేవిధంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితునిగా మెలిగారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా, టీటీడీ మాజీ చైర్మన్గా, హెరిటేజ్ కంపెనీలో డైరెక్టర్గా, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రా చాంబర్ రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు డైరెక్టర్గా సేవలందించారు. కాగా, సీతారామయ్య మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్గా విశేష సేవలందించారని కొనియాడారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లు నివాళులర్పించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో సీతారామయ్య సేవలను కొనియాడారు.