‘ఢిల్లీ’ దడ!
ABN , First Publish Date - 2020-03-31T09:33:07+05:30 IST
దక్షిణ ఢిల్లీలోని ‘నిజాముద్దీన్’ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. ఆ ప్రాంతం మాత్రమే కాదు... అక్కడ జరిగిన మత సదస్సులో పాల్గొని వచ్చిన వారిలోనూ కలవరం రేపుతోంది. ఏపీ, తెలంగాణలో ‘కరోనా
- నిజాముద్దీన్ నుంచి కరోనా విస్తరణ
- మార్చి 1 నుంచి మత సమావేశాలు
- ఇరాన్, ఇండోనేషియా నుంచీ రాక
- 16, 17 తేదీల్లో పాల్గొన్న తెలుగు వారు
- రెండు రాష్ట్రాల నుంచి 2 వేలమంది!
- సామూహిక ప్రయాణాలు, బస
- అక్కడే కరోనాతో కాంటాక్ట్లోకి!?
- రైళ్లలో తిరుగు ప్రయాణం
- ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్
- ఆ లక్షణాలతో రాష్ట్రంలో ముగ్గురి మృతి
- నిజాముద్దీన్ ప్రాంతంలో హై అలర్ట్
- ఐసొలేషన్కు సుమారు 200 మంది
- పోలీసుల స్వాధీనంలో మత సంస్థ కార్యాలయం
- ఎవ్వరూ బయటికి రాకుండా కట్టుదిట్టం
- డ్రోన్లతోనూ నిఘా
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్): దక్షిణ ఢిల్లీలోని ‘నిజాముద్దీన్’ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. ఆ ప్రాంతం మాత్రమే కాదు... అక్కడ జరిగిన మత సదస్సులో పాల్గొని వచ్చిన వారిలోనూ కలవరం రేపుతోంది. ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్’గా తేలిన వారిలో చాలామంది ఢిల్లీలో జరిగిన సదరు మత సదస్సుకు హాజరైన వారే. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రార్థనా మందిరంలో రెండున్నర రోజులపాటు ఒక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరయ్యారు. వీరిలో అత్యధికులు ఈనెల 14-15వ తేదీల్లో తమతమ ప్రాంతాల నుంచి రైళ్లలో బయలుదేరారు. 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం వరకు జరిగిన సదస్సులో పాల్గొన్నారు. 15 నుంచి 20 మందితో కూడిన బృందాలుగా వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించారు. ఢిల్లీలో ఉన్నన్ని రోజులు కలిసే బస చేశారు. ఆ తర్వాత ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రకారం రైళ్లలో బృందాలుగా వచ్చారు. ఏపీకి చెందిన వారు దురంతో ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లలో ప్రయాణించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి బావమరిదికి, ఆయనతోపాటు ఢిల్లీకి వెళ్లిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన సతీమణికి కూడా వైరస్ సోకింది. ఇక... ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఢిల్లీకి వెళ్లిన భార్యా భర్తలకూ పాజిటివ్ సోకింది. సోమవారం తెలంగాణలోనూ ‘ఢిల్లీ కనెక్షన్’ ఉన్న వారిలో ఏకంగా ఐదుగురు మరణించారు. మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే... ఢిల్లీ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన వారిలో పలువురు ఆ వివరాలు తెలిపేందుకు స్థానికంగా మరిన్ని ప్రార్థనా మందిరాల్లో చిన్నపాటి సమావేశాలు నిర్వహించారు.
ఇతర దేశాల నుంచీ...
రైలులో ప్రయాణిస్తున్న సమయంలోనే వీరికి వైరస్ సోకి ఉండవచ్చుననే తొలుత భావించారు. కానీ... వేర్వేరు రైళ్లలో, వేర్వేరు బోగీలలో ప్రయాణించిన వారికి ‘పాజిటివ్’ వచ్చింది. వీరు ఢిల్లీలో జరిగిన మత సదస్సుకు హాజరైన ఉమ్మడి నేపథ్యం ఉండటంతో... అక్కడే వైర్సతో ‘కాంటాక్ట్’ అయ్యారనే నిర్ధారణకు వచ్చారు. ఈ మత సదస్సుకు ఇరాన్, ఇండొనేషియా, ఉజ్బెకిస్థాన్, మలేషియా తదితర దేశాల నుంచి కూడా మత పెద్దలు హాజరయ్యారు. ఇరాన్లో భారీ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. సంస్థ ప్రధాన కార్యాలయంలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు వరుసగా సమావేశాలు జరిగాయని... దీనికి కొనసాగింపుగా మరిన్ని భేటీలు జరిగాయని తెలుస్తోంది.
నిజాముద్దీన్లో హైఅలర్ట్
ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఒక మతపెద్ద గత వారం శ్రీనగర్లో కరోనాతో మరణించారు. ఆ వెంటనే కలకలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్ధారణ అయిన కరోనా కేసుల్లోనూ ‘ఢిల్లీ కనెక్షన్’ బయటపడింది. ఇక... ఢిల్లీలోని సదరు మత సమావేశం జరిగిన సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న నిజాముద్దీన్ ప్రాంతంలో అనేక మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వీరు కూడా సదరు సమావేశానికి హాజరైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆదివారం రాత్రి ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు, పారామిలటరీ బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. 163 మంది అనుమానితులను ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సదరు సమావేశం జరిగిన ‘మర్కజ్ భవంతి’వైపు ఇతరులెవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. సదరు సమావేశాన్ని నిర్వహించిన సంస్థ ప్రధాన కార్యాలయాన్ని , చుట్టుపక్కల ఇళ్లను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవ్వరూ బయటికి రాకుండా డ్రోన్లతో నిఘా వేశారు. సదస్సుకు హాజరైన వారు బస చేసిన చుట్టుపక్కల హోటళ్లను కూడా సీజ్ చేశారు. కరోనా అనుమానితులను ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా బస్సులను కూడా సిద్ధం చేశారు. పశ్చిమ నిజాముద్దీన్, నిజాముద్దీన్ బస్తీలో దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు. కరోనా నేపథ్యంలో 50 మందికి మించిన సభలు, సమావేశాలు, ప్రార్థనల నిర్వహణపై ఢిల్లీ ప్రభుత్వం మార్చి 1వ తేదీనే నిషేధం విధించింది. అయినప్పటికీ... ‘మర్కజ్’ సమావేశాలు నిర్వహించిన మత పెద్దపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఆదేశించారు.