సమగ్రంగా చర్చించాకే నిర్ణయం
ABN , First Publish Date - 2020-06-26T08:10:39+05:30 IST
యూజీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలపై సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుందామని..
యూజీ, పీజీ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): యూజీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలపై సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత విద్యాశాఖకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఆయా పరీక్షలపై తాజాగా విశ్వవిద్యాలయాల వైస్చాన్సెలర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్న విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్, అధికారులు గురువారం సీఎంతో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయాల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను వారు వివరించారు.
అయితే లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన యూజీ, పీజీ పరీక్షల విషయంలో నోటి మాటలతో నిర్ణయాలు తీసుకోలేమని జగన్ వారితో అన్నట్లు తెలిసింది. పరీక్షలు రద్దు చేస్తే ఎందుకో చెప్పాలి, పరీక్షలు నిర్వహిస్తే ఎలాగో వివరించాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం. ఈ పరీక్షల నిర్వహణలో ఎదురయ్యే కష్ట, నష్టాలపై రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి వివరాలతో మళ్లీ రావాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.