హైకోర్టులో దమ్మాలపాటి పిటిషన్.. ఏ క్షణమైనా...
ABN , First Publish Date - 2020-09-16T01:20:34+05:30 IST
అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టులో మాజీ అడ్వకేట్
అమరావతి : అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. దమ్మాలపాటి తరపున ముకుల్ రోహత్గీ, శ్యాందివాన్ వాదనలు వినిపిస్తున్నారు. శ్రీనివాస్ను ఇరికించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే అభియోగాలు మోపారని ఆధారాలతో సహా పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. దీనిపై ఏ క్షణమైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా.. రాజధాని భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే.
కాగా.. అమరావతి భూముల్లో అక్రమాల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాను అమలు చేయడం మొదలుపెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కక్షలన్నీ తీర్చుకునేందుకు ఏసీబీ విచారణకు తెరతీసిందా? అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మాజీ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తిపై ఇలా పర్సనల్గా గురిపెట్టడం న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతి భూములపై విచారణ అంటూ జగన్ పర్సనల్ ఏజెండాను అమలు చేస్తున్నారని కూడా దమ్మాలపాటిపై నమోదు చేసిన కేసుతో తేలిపోయిందని అంటున్నారు. జగన్ గురి ఈనాటిది కాదు.. అక్రమాస్తుల కేసులో లాయర్గా దమ్మాలపాటి కీలకంగా వ్యవహరించారు. జగన్కి వ్యతిరేకంగా వాదించారు. అయితే గతంలోని కక్షతో దమ్మాలపాటిపై నేరుగా జగన్ గురి పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.