ఏమిటీ కక్ష సాధింపు?
ABN , First Publish Date - 2020-05-18T09:40:20+05:30 IST
విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు, దళిత సంఘాలు, హక్కు ల సంఘాలు ఆదివారం నిరసన దీక్షలు చేశాయి.
- దళితుడనే డాక్టర్ సుధాకర్ను వేధించారు: దళిత సంఘాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు, దళిత సంఘాలు, హక్కు ల సంఘాలు ఆదివారం నిరసన దీక్షలు చేశాయి. డాక్టర్ పట్ల పోలీసుల తీరు హేయమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నా రు. దాడిని నిరసిస్తూ ఆదివారం తన నివాసంలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మద్దిరా జోసఫ్ ఇమ్యానుయేల్(మ్యానీ), ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావులతో కలిసి నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం సాఽక్షిగా నిరసన దీక్ష చేశారు. ఒక వైద్యుడిని సస్పెండ్ చేసి మానసికంగా వేధించడమే కాకుండా దళితుడిని నడివీధిలో అవమానించారని చింతలపూడిలో టీడీపీ సీనియర్ నేత డాక్టర్ రాజారావు నిరసన వ్యక్తం చేశారు.
దేవరపల్లిలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వం అనాగరికంగా ప్రవర్తిస్తోందని నిరసన తెలిపారు. మాజీ మంత్రి పీతల సుజాత డాక్టర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బీసీలు, ఇతర పేద వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్ అన్నారు. డాక్టర్లకు మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని విశాఖలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కూడా పలు దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు.