దగ్గుబాటి పురంధేశ్వరి హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-18T14:41:41+05:30 IST
హిందూ ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం తీరుకు నిరనగా ఏపీ బీజేపీ ఆందోళన చేపడుతోంది.

ఒంగోలు : హిందూ ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం తీరుకు నిరనగా ఏపీ బీజేపీ ఆందోళన చేపడుతోంది. హిందూవాదులను అక్రమంగా అరెస్టులు చేశారంటూ ఈ రోజు ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన పిలుపుతో అలెర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
వరుస అరెస్ట్లు..
ముందుగా బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తాజాగా.. ప్రకాశం జిల్లా కారంచేడులో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి వెళ్ళకుండా ముందస్తుగా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు మాజీమంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబును హనుమాన్ జంక్షన్లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలిచారు.
నినాదాలు..
ఇదిలాఉంటే.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘ఛలో అమలాపురం’ ఇవాళ జరిగి తీరుతుందని సోమువీర్రాజు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. కాగా.. తాడేపల్లిలో సోము వీర్రాజు నివాసానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వీర్రాజు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీర్రాజు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు నిర్వహించారు.