ఎస్ఈసీ నిమ్మగడ్డతో సీఎస్ నీలం సాహ్ని భేటీ
ABN , First Publish Date - 2020-10-28T23:02:53+05:30 IST
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్తో సీఎస్ నీలం సాహ్ని సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నారు. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెల్పాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరిన నేపథ్యంలో

అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్తో సీఎస్ నీలం సాహ్ని సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నారు. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెల్పాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరిన నేపథ్యంలో ఎస్ఈసీతో సీఎస్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఉదయం వివిధ రాజకీయ పార్టీలతో రమేష్ కుమార్ సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ఈ భేటీకి అధికార వైసీపీ సహా ఆరు పార్టీలు హాజరు కాలేదు. రెండు పార్టీలు మాత్రం మెయిల్ ద్వారా అభిప్రాయం తెలిపాయి. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సిపీఐ, బీఎస్పీ తదితర పార్టీలు తమ అభిప్రాయాలను కమిషన్కు తెలియజేశాయి.
వైసీపీ ప్రకటనలో నిజం లేదు: నిమ్మగడ్డ రమేష్
స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించడం లేదన్న వైసీపీ ప్రకటనల్లో నిజం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాలను నిమ్మగడ్డ రమేష్కుమార్ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అభిప్రాయాలు తెలిపేందుకు 11 పార్టీలు హాజరైనట్లు తెలిపారు. రెండు పక్షాలు మాత్రం లిఖితపూర్వక సమాధానాలు పంపినట్లు పేర్కొన్నారు. సమావేశానికి ఆరు రాజకీయ పక్షాలు హాజరుకాలేదన్నారు.
కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్తో చర్చలు జరిపినట్లు నిమ్మగడ్డ రమేష్కుమార్ తెలిపారు. సీఎస్ నీలం సాహ్ని అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సీఈసీ అనుసరిస్తున్న విధానాలనే రాజకీయపక్షాల గుర్తింపు, సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా అమలు చేసినట్లు వివరించారు. కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటించినట్లు చెప్పుకొచ్చారు. సామాజిక దూరం, జాగ్రత్తలను అనుసరించడానికి, సమయ స్లాట్లతో వ్యక్తిగత సంప్రదింపులు ఉత్తమమైందిగా భావించినట్లు చెప్పారు. సురక్షితమైన అంశంగా భావించి ఈ విధానాన్ని అమలు చేసినట్లు స్పష్టంచేశారు. సంప్రదింపు ప్రక్రియలో వచ్చిన ఏకాభిప్రాయాలను, అభిప్రాయాలను గౌరవించాలని కమిషన్ కోరుకుంటుందని నిమ్మగడ్డ తెలిపారు.