పత్తి రైతుకు పండగేదీ?

ABN , First Publish Date - 2020-11-13T10:04:39+05:30 IST

దీపావళి పండగ నాటికి పత్తి తీతలు ముమ్మరంగా జరుగుతుంటాయి. రైతుల ఇళ్లు పత్తి నిల్వలతో కళకళలాడుతుంటాయి.

పత్తి రైతుకు పండగేదీ?

కంచికచర్ల: దీపావళి పండగ నాటికి పత్తి తీతలు ముమ్మరంగా జరుగుతుంటాయి. రైతుల ఇళ్లు పత్తి నిల్వలతో కళకళలాడుతుంటాయి. అలాంటిది ఇంతవరకు కిలో పత్తి కూడా ఇంటికి రాలేదు. కొంతమంది రైతులు పత్తి తీసినా.. రంగు మారి, నాణ్యత లేని పత్తిని క్వింటా రెండు వేలకు కూడా తీసుకోవటం లేదు. కృష్ణా జిల్లాలో ఈ ఏడాది 1.30 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. తోటలు ఆరేడు అడుగులు పెరిగాయి. కాపు బాగుంది. అయితే రైతుల సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. సెప్టెంబరు నెల చివర్లో గులాబీ రంగు పురుగు కనిపించింది. ఆపై వర్షాలు మొదలయ్యాయి.


ఎడతెగని వర్షాలతో చెట్టు అడుగు భాగంలోని కాయలు బూజు పట్టి నల్లగా మారిపోయాయి. కొన్ని కాయలు ముడుచుకుపోయాయి. గూడ, పూత, పిందెలు రాలిపోయాయి. పచ్చగా ఉండాల్సిన తోటలు ఎండు ముఖం వేశాయి. ఆకులు ఎండిపోయి చెట్లు గిడసబారాయి. ఈలోగా గులాబీ రంగు పురుగు ఉధృతమైంది. దీంతో కన్నీటి పర్యంతమైన రైతులు.. గత్యంతరం లేక నిలువెత్తు పెరిగిన పత్తి చేలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు.             

Updated Date - 2020-11-13T10:04:39+05:30 IST