శ్మశానంలో కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-08-08T08:40:11+05:30 IST
కరోనా పరీక్షల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాజిటివ్ వచ్చిన ముగ్గురు మహిళలు
నిడమర్రు, ఆగస్టు 7: కరోనా పరీక్షల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాజిటివ్ వచ్చిన ముగ్గురు మహిళలు అధికారుల నిర్లక్ష్యంతో ఉదయం నుంచి రాత్రి 8గంటల వరకు శ్మశానవాటికలో గడపాల్సి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రొవ్విడి గ్రామంలో గతంలో వచ్చిన ప్రైమరీ కాంటాక్టులకు సంబంధించి లక్షణాలున్న 30మందికి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు శ్మశాన వాటికలో పరీక్షలు నిర్వహించారు. దీనిపై స్థానికులు ప్రశ్నించినా అధికారులు పట్టించుకోలేదు. ముగ్గురు మహిళలకు పాజిటివ్ రావడంతో కొవిడ్ కేర్ సెంటర్కు తీసుకెళ్లేందుకు బస్సు వస్తుందని చెప్పి అధికారులు ఒక్కొక్కరుగా జారుకున్నారు.
ఒక్క వీధి లైటు కూడా లేని శ్మశానవాటికలో ఆ ముగ్గురు రాత్రి 8గంటల వరకు పడిగాపులు కాశారు. వారిలో ఇద్దరు 65 ఏళ్ల పైబడిన వృద్ధులు ఉన్నారు. తాము నరకయాతన అనుభవిస్తున్నామని, బతికుండగానే తమను శ్మశానంలో పెట్టారని వారు బంధువులతో ఫోన్లో తమ బాధను వెల్లడించుకున్నారు. దీనిపై స్థానిక పీహెచ్సీ సిబ్బందిని ప్రశ్నించగా సర్వర్ అందుబాటులో లేకపోతే తామేం చేయగలమని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఎంపీడీవో మహాలక్ష్మి చొరవతో రాత్రి 8గంటలకు బాధితులను కొవిడ్ సెంటర్కు తరలించారు.