కరోనా అయితే మాకేంటి..!
ABN , First Publish Date - 2020-07-06T13:46:23+05:30 IST
కరోనా అయితే మాకేంటి..!
ప్రభుత్వ కార్యాలయంలో పుట్టిన రోజు వేడుకలు
పాల్గొన్న అధికారులు
ప్రకాశం, బల్లికురవ: కరోనా కట్టడి చర్యల్లో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన రెవెన్యూ సిబ్బంది కట్టు తప్పారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ ఉద్యోగి పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడం వివాదాస్పదమైంది. బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సాయంత్రం అక్కడ పని చేస్తున్న కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్ పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. చీమకుర్తి తహసీల్దార్ మధు సూదనరావు ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. ఆయన లేకుం డానే తహసీల్దార్ టేబుల్పై కేక్ను కట్ చేశారు. మాస్కులు లేకపోగా కనీసం భౌతిక దూరం కూడా పాటించలేదు. ఇదిచూసిన ప్రజలు విస్మయానికి గురయ్యారు. బల్లికురవ మండలంలోని కొప్పరపాడు, కె.రాజుపాలెంలో వైరస్ ఉధృతంగా ఉండడం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. అవేమీ లెక్క చేయ కుండా రెవెన్యూ సిబ్బంది పుట్టిన రోజును నిర్వహించారు. ఇది ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.