ఏపీలో ఇప్పటి వరకూ ఎన్ని కరోనా పాజిటివ్ కేసులంటే..
ABN , First Publish Date - 2020-03-30T17:23:01+05:30 IST
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది.
![ఏపీలో ఇప్పటి వరకూ ఎన్ని కరోనా పాజిటివ్ కేసులంటే..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020033011454868/03302020115251n50.jpg)
అమరావతి : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఏపీ విషయానికొస్తే.. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరిందని ఈ మేరకు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. రాజమండ్రి, కాకినాడలో నిన్న రాత్రి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బులెటిన్లో సర్కార్ స్పష్టం చేసింది. గత రాత్రి మొత్తం 33 శాంపిల్స్ కలెక్ట్ చేయగా దానిలో రెండు పాజిటివ్ అని తేలింది. రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వ్యక్తికి, కాకినాడకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
ఫ్యామిలీ మొత్తానికి టెస్ట్లు!
ఇదిలా ఉంటే.. రాజమండ్రిలోని కాతేరు పంచాయతీ పరిధిలోని శాంతినగర్లోని 72 ఏళ్లు వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో.. స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఆస్పత్రికి తరలించి టెస్ట్లు చేస్తున్నారు. మరో 24 గంటల్లో రిపోర్టు రానున్నట్లు తెలుస్తోంది.