20 నిమిషాల్లో ఫలితం..!
ABN , First Publish Date - 2020-06-19T09:50:36+05:30 IST
కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం సమస్యగా మారింది. పైగా కరోనా పరీక్షల కిట్లు ..
![20 నిమిషాల్లో ఫలితం..!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020061903581/06192020041929n74.jpg)
రూ.600కే కరోనా నిర్ధారణ కిట్
తయారీ బృందంలో కడప విద్యార్థిని
రాయచోటి, జూన్ 18: కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం సమస్యగా మారింది. పైగా కరోనా పరీక్షల కిట్లు ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం రూ.600కే కరోనా నిర్ధారణ పరీక్ష కిట్ను అభివృద్ధి చేసింది. దీనితో 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఈ కిట్ అభివృద్ధి చేసిన ఇద్దరు సభ్యుల బృందంలో కడప జిల్లా గాలివీడు మండల విద్యార్థిని పట్టా సుప్రజ ఉండడం విశేషం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని ఉత్పత్తి చేస్తే రూ.350లకే ఈ కిట్ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు.
క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన ఈ కిట్కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నుంచి అనుమతి లభించగా.. పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు సుప్రజ పేర్కొన్నారు. ఐఐటీలో ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శివ్గోవింద్సింగ్ పర్యవేక్షణలో విద్యార్థులు సూర్యస్నాత త్రిపాఠి, పట్టా సుప్రజ ఈ కిట్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం ఆర్పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఫలితాల కోసం ఎక్కువ సమయం పడుతోంది. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే తమ కిట్ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని సుప్రజ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.