పుష్కర ఘాట్లలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-11-27T10:05:40+05:30 IST
తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్యులు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు
కొత్తగా 3 పాజిటివ్ కేసులు
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 26: తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్యులు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం 128 మంది సిబ్బంది, భక్తులకు ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షించగా ముగ్గురుకి పాజిటివ్గా నిర్ధారణ అయి కలకలం రేపింది. సంకల్బాగ్ ఘాట్, రాంరబొట్ల ఆలయంలో డ్యూటీకి వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు, ఓ భక్తుడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో పుష్కర ఘాట్లలో ఇప్పటి వరకు పాజిటివ్ల సంఖ్య 15కు చేరింది. వీరిలో 14 మంది పోలీసులే. సంకల్బాగ్లో అత్యధికంగా 8మందికి పాజిటివ్గా నమోదైంది.