త్వరలో 25వేల టెస్టింగ్‌ కిట్లు

ABN , First Publish Date - 2020-04-03T09:17:15+05:30 IST

త్వరలో 25వేల టెస్టింగ్‌ కిట్లు

త్వరలో 25వేల టెస్టింగ్‌ కిట్లు

మెడ్‌టెక్‌ జోన్‌లో బెడ్‌షీట్లు, మాస్కుల తయారీ: మేకపాటి  


అమరావతి, ఏప్రిల్‌ 2, (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమల్లో కరోనా నియంత్రణకు అవసరమైన ఉత్పత్తుల తయారీపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్దేశించారు. ఇందులోభాగంగా కరోనా సోకిన వారికి చికిత్సలో ముఖ్యమైన వెంటిలేటర్ల తయారీ బాధ్యతను విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌కు అప్పగించినట్లు తెలిపారు. 10రోజుల్ల 3వేల వెంటిలేటర్లు, 25వేల కరోనా టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. భవిష్యత్తు అవసరాలకు మరో ఆరువేల వెంటిలేటర్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వస్త్ర తయారీ రంగంలో ఉన్న పరిశ్రమలు, రిలయన్స్‌ పరిశ్రమతో సమన్వయం చేసుకుని మాస్కులు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు(పీపీఈ) తయారీ చేపట్టాలన్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని వస్త్రయూనిట్ల పరిశ్రమలు అత్యవసరంగా ఒక్కసారే వినియోగించే బెడ్‌షీట్ల తయారీపై దృష్టిపెట్టాలన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రి మేకపాటి గురువారం నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, డైరెక్టర్‌ సుబ్రమణ్యంలతో పాటు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్లు, జనరల్‌ మేనేజర్లతో ఈ విషయమై సమీక్షించారు.  

Updated Date - 2020-04-03T09:17:15+05:30 IST