ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2020-04-14T16:32:02+05:30 IST
ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ..
![ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన: దేవినేని ఉమా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041410124301/04142020110139n78.jpg)
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కొత్తగా ఎలక్షన్ కమిషనర్ను తీసుకురావడం కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తప్పించడానికి జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు జరుపుకుని విశాఖ వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఐదు రోజుల్లో లాక్ డౌన్ ఎత్తివేయగానే సీఎం జగన్ ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారని.. కొత్తగా వచ్చిన ఎస్ఈసీ కనగరాజ్ కూడా ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతున్నారని దేవినేని ఉమా అన్నారు.
విశాఖలో 20 పాజిటీవ్ కేసులు ఉన్నాయని, గుంటూరు జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని దేవినేని ఉమా అన్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికలు అవసరమా? అని ప్రశ్నించారు. అధికారులు తప్పులు చేయవద్దని కోరారు. ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో ఆడుకోవద్దన్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?.. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తామని ఒక మంత్రి అంటున్నారని ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ దేవినేని ఉమా ప్రశ్నించారు.