ఏలూరు దుస్థితిపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-12-12T01:44:39+05:30 IST
ఏలూరు ఘటనపై సీఎం జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యబృందాలు, నిపుణులతో ముఖ్యమంత్రి
అమరావతి: ఏలూరు ఘటనపై సీఎం జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యబృందాలు, నిపుణులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్, సీసీఎంబీ నిపుణులు పాల్గొన్నారు. ఏలూరులో పలువురు అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీశారు.
ఆధారాలు లేవు...
‘తాగునీరు కలుషితం అయిందనడానికి ఆధారాలు లభించలేదని ఢిల్లీ ఎయిమ్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), ఏపీ మున్సిపల్ శాఖ తెలిపింది. పురుగు మందుల అవశేషాలే ఈ పరిస్థితికి కారణమని ఎన్ఐఎన్ ప్రాథమిక అంచనాకు వచ్చింది. మరింత విశ్లేషణ, దీర్ఘకాలిక పరిశోధన అవసరమని ఎన్ఐఎన్ అభిప్రాయపడింది. అస్వస్థతకు గురైన వారిలో ఆర్గనోక్లోరిన్స్, ఆర్గనో ఫాస్పేట్స్ ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అవి రక్తంలోకి ఎలా చేరిందో తెలుసుకోవడానికి మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని నిపుణులు తేల్చిచెప్పారు.
లోతుగా పరిశోధన జరగాలి: సీఎం
నిపుణులు వ్యక్తం చేసిన ప్రతి కోణంలోనూ మరింత లోతుగా పరిశీలన, పరిశోధన జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు, ఆర్గానిక్ (సేంద్రీయ) ఉత్పత్తులను ప్రోత్సహించేలా ముందుకు సాగాలని సీఎం జగన్ సూచించారు. నిషేధిత రసాయనాలు, పురుగు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రైతులకు సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించాలన్నారు. అందు కోసం అవసరమైన పరికరాలు, ఉపకరణాలు ఆర్బీకేల పరిధిలో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
