సీజేకి జగన్‌ లేఖ తీవ్ర అభ్యంతరకరం

ABN , First Publish Date - 2020-11-07T09:26:11+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్‌ లేఖ రాసి.. అందులోని అంశాలను మీడియాకు వెల్లడించడం సరైంది కాదని,

సీజేకి జగన్‌ లేఖ తీవ్ర అభ్యంతరకరం

అఖిలభారత న్యాయవాదుల సంఘం 


న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్‌ లేఖ రాసి.. అందులోని అంశాలను మీడియాకు వెల్లడించడం సరైంది కాదని, తీవ్ర అభ్యంతరకరమని అఖిల భారత న్యాయవాదుల సంఘం పేర్కొంది. ఆ లేఖరాసి ఇప్పటికే నెల రోజులు దాటిపోయినందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరింది. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమని తేలితే కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ లేఖ వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, జవాబుదారీ విధానానికి తీరని నష్టం జరిగిందని.. దీనిని నివారించాల్సిన బాధ్యత ప్రధాన న్యాయమూర్తిపైనే ఉన్నదని అభిప్రాయపడింది. జగన్‌ లేఖను న్యాయవ్యవస్థ పనితీరులో జోక్యం కిందే పరిగణించాలని తెలిపింది. ఇటీవలి కాలంలో జరిగిన ఈ కొత్త పరిణామాలపై న్యాయవ్యవస్థకు బాధ్యులైనవారంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపిచ్చింది. జగన్‌ లేఖను భారత దేశ చరిత్రలోనే అసాధారణమైనదిగా సంఘం పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులను ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌, సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా దూషిస్తూ అఽధికారంలో ఉన్న వారు సహా పలువురు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు త న పిటిషన్‌ను తానే విచారించడం,  రిజిస్ర్టార్‌ లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం అసాధారణ పరిణామాలుగా న్యాయవాదుల సంఘం తీర్మానించింది. వీటిపై ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ మొత్తం పరిణామాలు భయోత్పాతం కలిగించేవిగా ఉన్నాయని అఖిల భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురేంద్రనాథ్‌, ప్రధాన కార్యదర్శి బికాస్‌ రంజన్‌ భట్టాచార్య వ్యాఖ్యానించారు.


జగన్‌ లేఖ వెల్లడిపై సుప్రీంలో పిటిషన్లు

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, దానిని అధికారికంగా బహిర్గతం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చర్యలను కోరుతూ సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌, యాంటీ కరప్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు మరో న్యాయవాది సునీల్‌ కుమార్‌ సింగ్‌ వేర్వేరుగా మూడు పిటిషన్లను దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి జస్టిస్‌ ఉదయ్‌ యూ లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌ల ధర్మాసనం ఈ నెల 16న విచారించనుంది.

Updated Date - 2020-11-07T09:26:11+05:30 IST