టెన్త్ పరీక్షలు మళ్లీ వాయిదా
ABN , First Publish Date - 2020-03-25T08:09:37+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. తాజాగా విడుదల చేసిన రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం...
- 2 వారాల తర్వాత తదుపరి నిర్ణయం: మంత్రి సురేశ్
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. తాజాగా విడుదల చేసిన రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ నిర్వహించాల్సిన పరీక్షలను 2 వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 31 తర్వాత పరిస్థితిని బట్టి పరీక్షలు నిర్వహించే తేదీలు చెబుతామన్నారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్లకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎంసెట్కు ఏప్రిల్ 5 వరకు, ఈసెట్, ఐసెట్లకు ఏప్రిల్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయాలన్నారు. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని కూడా వాయిదా వేశామని తెలిపారు.
వాయిదాపై కోర్టుకు చెప్పిన ఏజీ
కరోనా కలకలం నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ‘సొసైటీ ఫర్ బెటర్ లివింగ్’ సంస్థ అధ్యక్షుడు టి.భవానీ ప్రసాద్ దాఖలు చేసిన పిల్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగిం ది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ ఈ నెల 31వ తేదీ నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. కాగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏజీ చెప్పినందున.. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎన్.శ్రీనివా్స దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను వచ్చే ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది.