ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ సోదాలు
ABN , First Publish Date - 2020-08-22T10:00:45+05:30 IST
కడప జిల్లాకు చెందిన ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను నివాసాల్లో శుక్రవారం సీఐడీ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు.
కిలోల కొద్దీ బంగారు, వెండి ఆభరణాలు సీజ్
కోటికిపైగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం
కడప, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): కడప జిల్లాకు చెందిన ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను నివాసాల్లో శుక్రవారం సీఐడీ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. కడప జిల్లా ఖాజీపేట, హైదరాబాద్లోని హిమయత్నగర్లో ఉన్న ఇళ్లతో పాటు పలు సొసైటీల అధ్యక్షుల ఇళ్లల్లో ఏడు బృందాలు తనిఖీలు చేశాయి. ఖాజీపేటలో రూ.కోటికి పైగా నగదు, 2.968కిలోల బంగారు, 1.859 కిలోల వెండి ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు.
శంకరాపురం, ప్రొద్దుటూరు, దయాఖాన్పల్లి, వీఎన్ పల్లి మండలం ఊటుకూరుల్లో సోదాలు చేశారు. గత ప్రభుత్వంలో 2016 ఆగస్టులో ఆప్కో చైర్మన్గా శ్రీను బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలంలో ఆప్కో ద్వారా రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులు, పోలీసుశాఖతో పాటు వివిధ శాఖలకు చేనేత వస్త్రాల ముసుగులో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పవర్లూమ్ వస్త్రాలు సరఫరా చేసి, అక్రమాలకు పాల్పడ్డారని, బోగస్ సొసైటీలు స్థాపించి, ప్రభుత్వ సబ్సిడీ స్వాహా చేసి, రూ.కోట్లు దండుకున్నారని ఆరోపణలున్నాయి.