‘ఐకార్’ పరీక్షల్లో మార్పులు
ABN , First Publish Date - 2020-03-02T08:02:20+05:30 IST
జాతీయస్థాయిలో వివిధ అగ్రి కోర్సుల్లో ప్రవేశాలకు అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఏటా నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేపట్టనున్నట్లు...

- ఐసీఏఆర్ డీడీజీ డాక్టర్ ఆర్సీ అగర్వాల్
- వెటర్నరీ వర్సిటీలో అగ్రిస్పోర్ట్స్ ప్రారంభం
తిరుపతి(విద్య), మార్చి1: జాతీయస్థాయిలో వివిధ అగ్రి కోర్సుల్లో ప్రవేశాలకు అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఏటా నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేపట్టనున్నట్లు సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఆర్సీ అగర్వాల్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు ఉంటాయన్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వేదికగా ఆదివారం అగ్రిస్పోర్ట్స్-20ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఆ పరీక్షల నిర్వహణకు కేంద్రాలను పెంచాలని డిమాండ్లు వచ్చాయని, ఆ దిశగా 70-73 కేంద్రాలు ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. దేశంలో వ్యవసాయ అనుబంధ వెటర్నరీ, ఉద్యానవన, ఫిషరీస్ కోర్సులకు మంచి ఆదరణ ఉందని, ఆ కోర్సుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఐసీఏఆర్ కృషి చేస్తుందని తెలిపారు. వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వై.హరిబాబు మాట్లాడుతూ.. జాతీయస్థాయి అగ్రివర్సిటీల క్రీడా పోటీలకు తమ వర్సిటీ వేదికగా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.