పులివెందులలో మగాళ్లు లేరా?: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-03-14T00:25:41+05:30 IST

పులివెందులలో పోటీచేసేనాథుడే లేరని అక్కడ మగాళ్లు లేరా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రలో పులివెందుల పంచాయతీ చేస్తారా అని నిలదీశారు.

పులివెందులలో మగాళ్లు లేరా?: చంద్రబాబు

అమరావతి: పులివెందులలో పోటీచేసేనాథుడే లేరని అక్కడ మగాళ్లు లేరా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రలో పులివెందుల పంచాయతీ చేస్తారా అని నిలదీశారు. రాజకీయంగా మీరు సమాధి అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. 90శాతం గెలవాలని సీఎం జగన్‌ పిలుపు ఇచ్చాడని, దాంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. కడపలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తోందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, బలవంతంగా నామినేషన్‌ పత్రాల్ని లాక్కున్నారని మండిపడ్డారు. మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం చేస్తే.. నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని అమలు చేసే పరిస్థితి ఇదేనా? అని ప్రశ్నించారు. రాజధాని రైతులను మాత్రం రోజులతరబడి జైల్లో పెట్టారని, చట్టం కొందరికి చుట్టం.. కొందరికి శాపమా అని నిలదీశారు. ఈ అరాచకాలు ఎన్నికల కమిషన్‌కు కనిపించవా అని మరోసారి ప్రశ్నించారు. 38 ఫిర్యాదులు ఇస్తే టైమ్‌ లేదని చెబుతారా నిలదీశారు. 


ఎందుకు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను ఎందుకు బాధపెడుతున్నారని, తప్పు చేస్తున్నామన్న సిగ్గుకూడా మీకు లేదని ధ్వజమెత్తారు. తనను అరెస్ట్‌ చేయడంపై సమాధానం చెప్పమని డీజీపీని కోర్టు అడిగిందని గుర్తుచేశారు. అసైన్డ్‌ భూముల్ని దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని హైకోర్టు అందన్నారు. మీ దౌర్జన్యాలు, ఉన్మాద చర్యల్ని సాగనివ్వమని ఆయన హెచ్చరించారు. జెడ్పీటీసీలు, ఎంసీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారని, మాచర్లలో టీడీపీ నేతలకు ఏం పని అంటున్నారని, మాచర్ల మీ బందిపోటులకు స్థావరమా అని ప్రశ్నించారు. మాచర్లలో ఒక్క వార్డులో నామినేషన్‌ వేయలేకపోయామని, ఎన్నికల కమిషన్‌కు సిగ్గు లేదా అని నిలదీశారు. పోలీసులు వైసీపీకి వంతపాడుతారా అని మండిపడ్డారు. అరాచకాలు చేసి గెలవాలనుకుంటే ఖబడ్దార్‌.. జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చిరించారు. 

Updated Date - 2020-03-14T00:25:41+05:30 IST