వైసీపీ నేతల అవినీతి వ్యాప్తి కరోనాతో పోటీ : చంద్రబాబు
ABN , First Publish Date - 2020-07-10T23:21:27+05:30 IST
వైసీపీ నేతల అవినీతి వ్యాప్తి అనేది ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో పోటీ పడుతోందని టీడీపీ అధినేత

అమరావతి : వైసీపీ నేతల అవినీతి వ్యాప్తి అనేది ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో పోటీ పడుతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణ చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన వైద్యుల విషయమై వరుస ట్వీట్స్ చేశారు. ‘తెనాలి ఆస్పత్రిలో రోగులకు సేవలందిస్తూ వైద్యుడు కరోనా బారినపడ్డారు. కరోనా సోకిన వైద్యుడి ప్రాణాలూ నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయం. మర్యాద లేనిచోట పనిచేయలేమంటూ వైద్యుల సంఘం సీఎస్కు లేఖ రాయడమే రాష్ట్రంలో దుస్థితికి నిదర్శనం. ఏ రాష్ట్రంలోనైనా వైద్యుల పట్ల ఈ నిర్లక్ష్యం ఉందా..?. కరోనా రికవరీలో ఏపీ అట్టడుగున ఉండటం చూస్తే బాధేస్తోంది. వైసీపీ నేతల అవినీతి వ్యాప్తి కరోనాతో పోటీ పడుతోంది. కరోనాతో చనిపోయిన వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం పరిహారం అందించాలి. వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక భద్రతా పరికరాలు అందించాలి. శ్రీకాకుళం, నెల్లూరు డిఎంహెచ్వోలను సెలవుపై వెళ్లాలని ఒత్తిడి చేస్తుండటంతో పని చేయలేక పోతున్నట్లుగా వైద్యుల సంఘం లేఖలో డాక్టర్లు ఆవేదన వెలిబుచ్చారు. విజయవాడ, తెనాలి, నెల్లూరులలో డాక్టర్లు మరణించినా ఇంతవరకు నష్ట పరిహారం ప్రకటించలేదని వాపోయారు’ అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.