అంబేద్కర్ ఆశయాలు అమలు చేసింది ఎన్టీఆరే: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-04-14T14:59:58+05:30 IST

అంబేద్కర్ ఆశయాలు అమలు చేసింది ఎన్టీఆరే: చంద్రబాబు

అంబేద్కర్ ఆశయాలు అమలు చేసింది ఎన్టీఆరే: చంద్రబాబు

అమరావతి: మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే ఈరోజు పేదలకు న్యాయం జరుగుతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. సామాజిక ఐకమత్యానికి అడ్డుగా నిలుస్తున్న కులాల భావన నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై ఆధారపడే నూతన సమాజాన్ని నిర్మించడంలో అంబేద్కర్ చేసిన కృషి సాటిలేనిదని కొనియాడారు.


అంబేద్కర్ ఆశయాలను దేశంలో తొలుత అమలు చేసింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.  1990లో అంబేద్కర్ మహాశయునికి భారతరత్న ప్రకటించడంలో నాడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. అలాగే పార్లమెంటులో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటులో కూడా తెలుగుదేశం పట్టుదల ఉందన్నారు. తాను ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం 2003లో జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను నియమించిన పార్టీ తెలుగుదేశమే అని గుర్తు చేశారు. గత టీడీపీ హయాంలో రూ.40,253కోట్లను ఎస్సీల సంక్షేమానికి కేటాయించామని చంద్రబాబు వెల్లడించారు. 


అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతి వనం నిర్మాణం ప్రారంభించామన్నారు. ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ఆ పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యానిధి అని పేరుపెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. 



Updated Date - 2020-04-14T14:59:58+05:30 IST