సెంటు స్థలంలో ఇల్లు ఎలా కడతారు?: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-12-02T00:28:30+05:30 IST
అసెంబ్లీలో రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారని.. ఇది చట్టబసభలకు మర్యాద కాదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి: అసెంబ్లీలో రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారని.. ఇది చట్టబసభలకు మర్యాద కాదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇదేమిటని అడిగితే స్పీకర్ నాపై పేపర్లు విసిరేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇళ్ల స్థలాలకు మేం అడ్డుపడుతున్నామంటున్నారు.. ఇప్పుడెలా ఇస్తున్నారని వైసీపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. శ్మశానాలు, ఆవ భూములు, అసైన్డ్ భూములు ఇస్తారా? అని మండిపడ్డారు. ఎవరో కడుపుమండి కోర్టుకెళ్తే మాపై విమర్శలు చేస్తారా.. ఇదేనా పాలనకు నిదర్శనం అని ఎద్దేవా చేశారు.
ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి.. ఎంక్వైరీ వేస్తే నిరూపిస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్ల విషయంలో ‘‘మా ఇల్లు నా సొంతం’’ అని పిలుపు ఇచ్చాం అని గుర్తు చేశారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో ఇప్పుడు ఒక కేటగిరీ ఫ్రీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా కడతారని.. మేం గ్రామాల్లో మూడు సెంట్లు, నగరాల్లో రెండు సెంట్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు సెంటు భూమి ఇచ్చి మురికివాడలు తయారు చేస్తారా.. ఇలా ప్రజలను గాలికొదిలేస్తారా అని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై టీడీపీ నిరంతర పోరాటం చేస్తుందని చెప్పారు.