సీఎం జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-12-17T21:27:39+05:30 IST

చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.

సీఎం జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం అమరావతి రైతులు ఏర్పాటు చేసిన జనభేరీ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉంటుందని సీఎం చెప్పాలన్నారు. లేదా జగన్‌రెడ్డికి దమ్ముంటే రెఫరెండానికి సిద్ధం కావాలన్నారు. 45 రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందామని, జగన్ గెలిస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ చేశారు.


తాను అధికారం కోసం పోరాడడం లేదని చంద్రబాబు అన్నారు. అధికారం తనకు కొత్త కాదని, 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని, ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడుతున్నామని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ముందుకెళ్తున్నామన్నారు. సలాం కుటుంబాన్ని ఎంత వేధించాలో అంత వేధించారని, అలాగే రాజమండ్రిలో అత్యచార బాధితురాలి కుటుంబాన్ని పోలీసులే వేధించారని చంద్రబాబు ఆరోపించారు. చీరాలలో మాస్క్‌ పెట్టుకోలేదని యువకుడిని కొట్టి చంపారన్నారు. మరి మాస్క్‌ పెట్టుకోని ఈ ముఖ్యమంత్రిని కూడా శిక్షించాలి కదా అని అన్నారు. పోలీస్ వ్యవస్థను నడిపే అజ్ఞాత శక్తి సజ్జల రామకృష్ణా రెడ్డని, తన ఇంటి గేటుకు తాళ్లు కడతారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2020-12-17T21:27:39+05:30 IST