విజయసాయి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా జవాబు

ABN , First Publish Date - 2020-09-21T20:36:55+05:30 IST

రాజ్యసభలో సోమవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు

విజయసాయి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా జవాబు

4,860 కోట్ల పీఎఫ్‌ వాటా చెల్లింపులతో ఊరట


న్యూఢిల్లీ/అమరావతి : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలు, సిబ్బంది ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లింపులలో ఊరట కలిగించేందుకు ప్రభుత్వం మార్చి నుంచి ఆగస్టు వరకు 4860 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపినట్లు కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ యోజన కింద ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 


100 మంది సిబ్బంది కలిగిన సంస్థలలో నెలకు 15 వేల రూపాయల వేతనం పొందే ఉద్యోగులు 90 శాతం ఉంటే ఉద్యోగులు తమ వాటా కింద చెల్లించాల్సిన 12 శాతంతో పాటు యజమాని చెల్లించాల్సిన 12 శాతం వాటా సొమ్మును కుడా వారి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేసినట్లు చెప్పారు. మొదట మార్చి, ఏప్రిల్‌, మే మాసాలకు మాత్రమే చేసిన ఈ చెల్లింపులను తదుపరి జూన్‌, జూలై, ఆగస్టు మాసాలకు పొడించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.


ఈ పథకాన్ని మరికొంత కాలం పొడిగించాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన మీదటే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా అమలు చేసిన ఈ పథకం కింద సెప్టెంబర్‌ 16 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 11196 సంస్థలు, ఒక లక్షా 92 వేల 431 మంది ఉద్యోగులు లబ్ది పొందినట్లు మంత్రి వెల్లడించారు.

Updated Date - 2020-09-21T20:36:55+05:30 IST