18 నుంచి రోడ్లపైకి బస్సులు?

ABN , First Publish Date - 2020-05-11T09:15:11+05:30 IST

యాభై రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కెందుకు సిద్ధమవుతున్నాయి.

18 నుంచి రోడ్లపైకి  బస్సులు?

  • లగ్జరీలో 26, పల్లె వెలుగులో 34 మందికే చోటు
  • ఆ మేరకు సీట్లు సర్దుబాటు చేస్తున్న పీటీడీ
  • ప్రతి డిపో నుంచి 4-12 వరకు బస్సులు సిద్ధం
  • నష్టాల భర్తీకి 40-50% చార్జీల పెంపు?
  • ప్రయాణికుడి చేతిలో రెండు చుక్కలు శానిటైజర్‌
  • ఆ బాధ్యతా డ్రైవర్‌కే.. కండక్టర్‌ ఉండరు..
  • ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన పీటీడీ..
  • సర్కారు అంగీకరిస్తే ప్రయాణికులపై భారమే


అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): యాభై రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కెందుకు సిద్ధమవుతున్నాయి. కొవిడ్‌-19 ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ నుంచి ఒక్కొక్కటిగా సడలింపులు వస్తుండటంతో పీటీడీ(ప్రజా రవాణా విభాగం) అధికారులు బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 17 తర్వాత మరోమారు కేంద్రం లాక్‌డౌన్‌ను కొనసాగించినా, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల వరకూ సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో సీట్లను పీటీడీ సర్దుబాటు చేస్తోంది. సీట్ల కెపాసిటీని సగానికి తగ్గించుకోక తప్పడంలేదు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి 40-50 శాతం టికెట్ల ధర పెంచేందుకు పీటీడీ  ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ప్రయాణికులపై భారం తప్పదు.  


సీట్ల సర్దుబాటు ఇలా...  

పీటీడీలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులున్నాయి. దూర ప్రాంతాలకు సూపర్‌ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్‌ సర్వీసులున్నాయి. రాష్ట్రం బయటికి వెళ్లే వాటిలో ఎక్కువగా ఏసీ బస్సులు ఉన్నాయి. పల్లెవెలుగు బస్సులో 60 సీట్ల కెపాసిటీ ఉండగా, ఇకపై 34మందికి మించకుండా తీసుకెళ్తారు. ముగ్గురు కూర్చునే సీట్లలో మధ్యలో వదిలేసి ఇద్దరికే  అవకాశమిస్తారు. ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరినే కూర్చోబెడతారు. ఫలితంగా 26 సీట్లు ఖాళీగా వదిలాల్సి ఉంటుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే 40శాతం చార్జీ పెంచాల్సిందే అంటున్నారు అధికారులు. ఇక సూపర్‌లగ్జరీ బస్సులో రెండు వరుసలుగా 36 సీట్లు ఉంటాయి.


అటు తొమ్మిది, ఇటు తొమ్మిది తొలగించి మధ్యలో ప్రయాణీకులు నడిచే ప్రాంతంలో 8 సీట్లు కొత్తగా అమర్చారు. దీంతో ఇకపై ఈ బస్సుల్లో 26మందికి మించి ప్రయాణించడం సాధ్యం కాదు. కనీసం 30శాతానికిపైగా నష్టాల్ని భరించక తప్పదు. అలా్ట్ర డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం 40 సీట్లున్నాయి. కుడివైపు పది, ఎడమ పది సీట్లు తొలగించి మధ్యలో 8 అమర్చుతున్నారు. అంటే 12 సీట్లు తగ్గుతాయి. ఈ నెల 18 నాటికి ప్రతి బస్‌ డిపోలోనూ 4 నుంచి 12 బస్సుల వరకు ఆ మేరకు సీట్లు సర్దుబాటు చేయనున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 128 బస్‌ డిపోల నుంచి మొత్తం సుమారు 800 బస్సులకు సీట్ల సర్దుబాటు వచ్చే ఆదివారం నాటికి పూర్తవుతుందని పీటీడీ అధికారులు చెబుతున్నారు. 


ఏసీ బస్సుల్లో సగం సీట్లే..

కాగా, దూర ప్రాంతాలతోపాటు రాష్ట్రం దాటి వెళ్లే ఏసీ బస్సుల్లో సీట్ల మార్పులు చేయడం లేదని పీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇంద్ర సర్వీసుల్లో రెండు సీట్లు చొప్పున రెండు వరుసల్లో 40 సీట్లు ఉండగా ఒక్కో ప్రయాణికుడికే అనుమతించాలని భావిస్తున్నారు. అమరావతి బస్సుల్లో 48 సీట్లు ఉంటే అందులో సగం సీట్లే భర్తీ చేస్తారు.  


బస్సెక్కగానే చేతిలో రెండు చుక్కలు..

ఈ బస్సుల్లో కండక్టర్‌ ఉండరని పీటీడీ అధికారులు చెబుతున్నారు. సీట్లకు మించి ఒక్క ప్రయాణికుడిని కూడా ఎక్కించబోమని, ప్రతిదీ గ్రౌండ్‌ బుకింగ్‌ చేసిన తర్వాత డ్రైవర్‌ను మాత్రమే పంపుతామని చెబుతున్నారు. ప్రతి ప్రయాణికుడికి చేతిలో శానిటైజర్‌ వేయాలన్న ఆలోచన ఉందని, ఆ బాధ్యత డ్రైవర్‌కు అప్పగిస్తామంటున్నారు.  


భౌతిక దూరం పాటించేలా 

ఆర్టీసీ బస్సులో సీట్ల సర్దుబాటు

Updated Date - 2020-05-11T09:15:11+05:30 IST