రోడ్డెక్కేందుకు బస్సులు సిద్ధం

ABN , First Publish Date - 2020-05-18T09:57:38+05:30 IST

55 రోజులకు పైగా డిపోలకే పరిమితమైన బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి.

రోడ్డెక్కేందుకు బస్సులు సిద్ధం

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): 55 రోజులకు పైగా డిపోలకే పరిమితమైన బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రెడీగా ఉన్నాయి. కొన్ని రోజులుగా డిపోల్లో బస్సులను శుభ్రం చేయించి, కండిషన్‌ చెకప్‌ చేయించిన అధికారులు సోమవారం(18వ తేదీ) నుంచి డ్రైవర్లు, కండక్టర్లను విధులకు రావాలంటూ ఫోన్లకు మెసేజ్‌ పంపారు. లాక్‌డౌన్‌తో ఆర్టీసీ సిబ్బంది కొందరు ఇళ్లకు పరిమితం కాగా మరికొందరు పోలీసులకు సహాయకులుగా పనిచేస్తున్నారు. మూడో విడత లాక్‌డౌన్‌ ఆదివారం(17)తో ముగియడంతో అదే రోజు సాయంత్రం పీటీడీ డ్రైవర్లు, కండక్టర్లకు బస్‌ డిపోల నుంచి కబురొచ్చింది.


మొత్తం సిబ్బందిని ఆర్టీసీ యాజమాన్యం విధులకు పిలవడంతో బస్సులు తిరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదని, ఆదివారం అర్ధరాత్రికో, సోమవారం ఉదయానికో ఏదైనా ఆదేశాలు వస్తే సిద్ధంగా ఉండాలి కదా? అని అన్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో బస్సుల్లో కండక్టర్‌ లేకుండా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే వారం నుంచి కొన్ని గంటల ముందు వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. 

Updated Date - 2020-05-18T09:57:38+05:30 IST