అమరావతిని నిర్మించండి.. ఆంధ్రాని కాపాడండి
ABN , First Publish Date - 2020-06-05T09:44:51+05:30 IST
అమరావతిని నిర్మించండి.. ఆంధ్రాని కాపాడండి అంటూ 170వ రోజు ఆందోళనలో రాజధాని రైతులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలను అనుసరిస్తూ గురువారం 29 గ్రామాల రైతులు, మహిళలు బృందాలుగా
170వ రోజు ఆందోళనలో రాజధాని రైతులు
గుంటూరు, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): అమరావతిని నిర్మించండి.. ఆంధ్రాని కాపాడండి అంటూ 170వ రోజు ఆందోళనలో రాజధాని రైతులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలను అనుసరిస్తూ గురువారం 29 గ్రామాల రైతులు, మహిళలు బృందాలుగా ఏర్పడి మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాలలో నిరసనలు తెలిపారు. వారు మాట్లాడుతూ అమరావతి నిర్మాణాలు నిలిపి వేయటంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు. పరిపాలనలో కాదు అభివృద్ధిలో వికేంద్రీకరణ చేయండి అంటూ నినాదాలు చేశారు. అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ రైతులు, మహిళలు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి నినాదాలు చేశారు.
రైతుల డిమాండ్లను గౌరవించాలి: కన్నా
రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లను గౌరవించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం సీఎం జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వం వెంటనే రాజధాని ప్రాంత రైతుల డిమాండ్లను గౌరవించి అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వానికి కన్నా విజ్ఞప్తి చేశారు.