అనుమానం.. అమానవీయం!

ABN , First Publish Date - 2020-07-19T09:01:40+05:30 IST

కరోనాతో మృతి చెంది ఉంటుందన్న అనుమానంతో ఓ శిశువు మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు ఆ గ్రామస్థులు. దిక్కుతోచని స్థితిలో

అనుమానం.. అమానవీయం!

  • ప్రసవంలో జాప్యంతో శిశువు మృతి
  • ఖననానికి అనుమతించని గ్రామస్థులు
  • కేసీ కెనాల్‌లో పడేసిన తండ్రి


నంద్యాల(నూనెపల్లె), జూలై 18: కరోనాతో మృతి చెంది ఉంటుందన్న అనుమానంతో ఓ శిశువు మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు ఆ గ్రామస్థులు. దిక్కుతోచని స్థితిలో మృతశిశువును కాలువలో పడేశాడు ఆ తండ్రి. అమానవీయమైన ఈ ఘటన కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. కోటపాడుకు చెందిన మదార్‌ బీ పురిటి నొప్పులతో శుక్రవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. కొవిడ్‌ టెస్టు చేసిన వైద్యులు.. ఫలితం వచ్చాకే కాన్పు చేస్తామన్నారు. సాయంత్రానికి నెగెటివ్‌ అని వచ్చింది. వైద్యులు కాన్పు చేశారు. కానీ ఆలస్యం కావడంతో బిడ్డ మృతిచెందింది. మనోవేదనతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లాడు తండ్రి షామీర్‌ వలీ. కానీ కొవిడ్‌తో శిశువు మృతిచెందిందని భావించిన గ్రామస్థులు ఖననానికి అనుమతించలేదు. దిక్కుతోచని అతను.. చీకటిపడ్డాక చాబోలు సమీపంలోని కేసీ కెనాల్‌లో పడేశాడు. ఆ గ్రామస్థులు శనివారం ఉదయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశువు దేహానికి ఉన్న ట్యాగ్‌ ఆధారంగా పోలీసులు తల్లిదండ్రులను గుర్తించి పిలిపించారు. జరిగిన ఘోరాన్ని వివరించిన షావలీ బోరున విలపించాడు. కాగా, కరోనా టెస్టు ఫలితాలు ఆలస్యం కావడం.. ఆలస్యంగా కాన్పు జరిగి ఆడశిశువు మృతి చెందిన విషయం తన దృష్టికి రాలేదని ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-07-19T09:01:40+05:30 IST