బిల్లు పెట్టినప్పుడే వికేంద్రీకరణ మొదలైంది
ABN , First Publish Date - 2020-02-08T10:46:51+05:30 IST
శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే వికేంద్రీకరణ ప్రక్రియ మొదలైందని, ఎప్పటికి ముగుస్తుందో ఇప్పుడే చెప్పలేనని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

తరలింపుపై కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం
తొలగించిన పెన్షన్లపై రీసర్వే: మంత్రి బొత్స
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే వికేంద్రీకరణ ప్రక్రియ మొదలైందని, ఎప్పటికి ముగుస్తుందో ఇప్పుడే చెప్పలేనని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇది తమ ప్రభుత్వ విధానమని, పరిపాలన సౌలభ్యం కోసం వికేంద్రీకరణ జీవోలు జారీ చేస్తుంటామని చెప్పారు. చట్టాలకు లోబడి కోర్టులు పనిచేస్తాయని, తాము కోర్టుకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. తరలింపు అంశంలో కోర్టు ఆదేశాలను గౌరవిస్తామన్నారు. నిబంధనల ప్రకారమే పనులు జరుగుతాయన్నారు. విజిలెన్స్ కమిషన్ ఫలానా చోటే ఉండాలని ఏ చట్టంలో ఉందని మంత్రి ప్రశ్నించారు. కార్యాలయాలు ఎక్కడ పెట్టాలనేది ప్రభుత్వ ఇష్టమన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అప్పటి పెద్దలు అ మలు చేయలేదు కాబట్టే ఇప్పుడు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. భూ మికి బదులు భూమి ఇవ్వమని రాజధాని రైతులు కోరగా, పరిశీలిస్తామని సీ ఎం చెప్పినట్టు వివరించారు. రాష్ట్రంలో అనర్హులుగా గుర్తించిన 4,16,034 మంది పెన్షనర్లను అర్హులుగా నిర్ధారణ అయితే వారికి కూడా పించన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు బొత్స తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు, జా యింట్ కరెంటు మీటర్లు లాంటి కారణాలను తిరిగి పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రం నుంచి కియ, ఇతర పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ కొందరు దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అసత్య వార్తలు, అవాస్తవ కథనాలు రాస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.