వైసీపీ కార్యక్రమానికి ఏయూ వీసీ!

ABN , First Publish Date - 2020-04-24T08:15:48+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతి ప్రసాద్‌రెడ్డి గురు వారం వైసీపీ నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఇటీవల జీవీఎంసీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను...

వైసీపీ కార్యక్రమానికి ఏయూ వీసీ!

  • వార్డులో సరుకుల పంపిణీకి హాజరు
  • పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతి ప్రసాద్‌రెడ్డి గురు వారం వైసీపీ నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఇటీవల జీవీఎంసీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి మూడు రోజులు విధులకు దూరంగా ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన తనకు కావలసిన వారికి టిక్కెట్లు ఇప్పించుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా.. మద్దిలపాలేనికి చెందిన గుడ్ల సత్యారెడ్డి కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన వైసీపీలో చేరి మూడు రోజులు కాకుండానే 23వ వార్డు టిక్కెట్‌ దక్కించుకున్నారు. ఆయనకు కార్పొరేటర్‌ టిక్కెట్‌ను ప్రసాద్‌రెడ్డి ఇప్పించారని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ అభ్యర్థితో కలిసి ఆయన వార్డులో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదలకు సరకుల పంపిణీ అంటూ సత్యారెడ్డి గురువారం తన వార్డులో కార్యక్రమం చేపట్టగా దానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అక్కడున్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి, ఆ తరువాత ఆయనే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అక్కడి వారంతా ఆయన ప్రభుత్వ ఉద్యోగా?, పార్టీ నాయకుడా? అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.


ప్రభుత్వ సాయం పంపిణీ చేసిన అభ్యర్థి

ఇదిలా ఉండగా ప్రభుత్వం పేదలకు కరోనా సాయం కింద వేయి రూపాయల నగదును అందిస్తోంది. ఈ మొత్తం వార్డు వలంటీర్లు ఇవ్వాల్సి వుండగా, 23వ వార్డులో మాత్రం వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి గుడ్ల సత్యారెడ్డే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. సొంత సొమ్ము ఇస్తున్నట్టు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. విశాఖపట్నంలోని అన్ని వార్డుల్లోను వైసీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా...ఏ అధికారీ చర్యలు తీసుకోలేకపోతున్నారు.


Updated Date - 2020-04-24T08:15:48+05:30 IST