అరగంట ఆలస్యంగా అసెంబ్లీ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-01T08:45:40+05:30 IST
శాసనసభ శీతాకాల సమావేశాలు తొలిరోజు అరగంట ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు సోమవారం ఉదయం 9గంటలకు
అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): శాసనసభ శీతాకాల సమావేశాలు తొలిరోజు అరగంట ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు సోమవారం ఉదయం 9గంటలకు ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్ జారీఅయింది. కాని 9.30కు ప్రారంభమయ్యాయి. ఇది చాలా అరుదు కావడంతో లాబీల్లో దీనిపై చర్చ జరిగింది. ‘‘ఇలా ఎప్పుడూ జరగదు. కోరం లేకపోతే సమావేశాన్ని ప్రారంభించి వాయిదా వేస్తారు. కాని నోటిఫికేషన్కు భిన్నంగా ఆలస్యంగా జరపడం ఇప్పుడే చూస్తున్నా’’ అని టీడీపీ నేత యనమల వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా స్వామి దీనిపై మంత్రి విశ్వరూప్ను ప్రశ్నించినప్పుడు... ‘‘ముఖ్యమంత్రి సమయానికే వచ్చారు. స్పీకర్కు విరోచనాలు అవుతుండటం వల్ల ఆలస్యం అయింది’’ అని చెప్పారు. బీఏసీ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. ‘‘గ్రేట్ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నారు. ఆయన రావడం కోసం ఆలస్యంగా ప్రారంభించాం’’ అని సీఎం హాస్యంగా బదులిచ్చారు. దానికి అచ్చెన్న... ‘‘నా కోసం సభ ఆగదు. అసలు కారణం ఏమిటో చెప్పండి’’ అని అడిగినా ఎవరూ బదులివ్వలేదు.