రైతును ఆదుకోకుంటే అసెంబ్లీ ముట్టడి
ABN , First Publish Date - 2020-12-29T07:38:30+05:30 IST
నివర్ తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
- వచ్చే సమావేశాల్లోపు పరిహారమివ్వాలి
- ఎకరాకు రూ.35 వేలు చెల్లించాలి
- తక్షణ సాయంగా పదేసి వేలివ్వాలి
- విశాఖ, అమరావతి, పులివెందుల్లో
- ఎక్కడ సభ పెట్టినా జనసేన సై
- అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తాం
- రైతులు, నిరుద్యోగులు కదలిరావాలి
- జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు
మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. అయ్యా బాబూ సీఎం గారూ అంటే వినడం లేదు.
అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టుకున్నా మేమొస్తాం. మీరు సై అంటే మేమూ సై..
వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేనను చూసి భయపడుతున్నారు.
- పవన్ కల్యాణ్
మచిలీపట్నం/గుడివాడ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నివర్ తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు సరైన సాయం అందించకుంటే శాసనసభను ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడ, పెడన, మచిలీపట్నంలో జనసేన నిర్వహించిన ‘జై కిసాన్’ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ.. ‘ఒక ఏడాది మద్యం ఆదాయం వదులుకుంటే రైతులకు పరిహారం ఇవ్వవచ్చు. సీఎం సాబ్కు వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి.. బాధిత రైతులకు తక్షణం రూ.పది వేలు నష్టపరిహారం విడుదల చేయాలి. ఎకరాకు రూ.35 వేలు విడుదల చేయాలి. లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తాం. సమావేశాలు ఎక్కడ పెట్టుకున్నా మేమొస్తాం.
మీరు సై అంటే మేమూ సై.. వైజాగ్లో పెడతారా.. అమరావతిలో పెడతారా.. పులివెందులలో పెడతారా.. ఎక్కడైనా ఓకే.. అసెంబ్లీని ముట్టడిస్తాం. 151 మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారని వైసీపీ నాయకులు ధైర్యంగా ఉండొద్దు.. జనసేనకు ఒక ఎమ్మెల్యేనే ఉన్నా.. ఆయన ఎక్కడ కూర్చున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా రైతుల ప్రయోజనం కోసం అసెంబ్ల్లీని ముట్టడిస్తుంది’ అని స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగులు అందరూ కదలి రావాలని పిలుపిచ్చారు. రైతాంగంలో 70 శాతం మంది కౌలు రైతులేనని, వలంటీర్ల ద్వారా వారిని గుర్తించడానికి ఉన్న ఇబ్బందులేమిటని ప్రశ్నించారు. పంటలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ధ్వజమెత్తారు.
అన్ని కులాలూ బలంగా ఉండాలి..
రాజకీయం కేవలం రెండు, మూడు కులాలకు పరిమితం కాదని పవన్ అన్నారు. అన్ని కులాలు, మతాలు రాజకీయంగా బలంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకునేవాడినని చెప్పారు. మచిలీపట్నంలో లక్ష్మీటాకీసు సెంటరు నుంచి కలెక్టరేట్కు రైతులతో కలసి వెళ్లిన ఆయన.. రైతులను ఆదుకోవాలని డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కాగా.. గుడివాడ, గుడ్లవల్లేరుల్లో పవన్ రోడ్షో నిర్వహించారు. గుడివాడలో క్రేన్ సాయంతో ఆయనకు గజమాల వేశారు.
మీరు వ్యాపారాలు మానేస్తే..నేనూ సినిమాలు మానేస్తా
మైనింగ్, మీడియా సంస్థలు నడిపేవాళ్లు, సిమెంట్ కంపెనీలు నడిపేవాళ్లు పేకాట క్లబ్లు నిర్వహించే వాళ్లకు రాజకీయాలు చేసే అర్హత ఉన్నపుడు తాను సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తే సమస్య ఏమిటని పవన్ ప్రశ్నించారు. ‘వాళ్లు ఆ వ్యాపారాలు మానేస్తే.. నేనూ సినిమాలు మానేస్తా’ అని సవాల్ విసిరారు.
శతకోటి లింగాల్లో బోడిలింగం!
‘నాని’లపై జనసేనాని విసుర్లు
పవన్ తన పర్యటనలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిల తీరును ఆక్షేపించారు. ‘ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కరు బూతులు తిడుతున్నారు. నన్ను కూడా తిడుతున్నారు. ఇక్కడున్న (మచిలీపట్నం) ఎమ్మెల్యే పేరు ఏంటమ్మా! (సభికులు పేర్ని నాని చెప్పారు) వైసీపీలో నానీలు ఎక్కువమ్మా.. ఏదో ఒక నాని, ఏ నానియో అర్థం కావడం లేదు, గుర్తు కూడా లేదు. శతకోటి లింగాల్లో బోడిలింగం.. ఎవరైతే మనకేంటి? శతకోటి నానిల్లో ఒకరైన నానిగారికి చెబుతున్నా..మీ సీఎం సాబ్ జగన్రెడ్డికి చెప్పండి రైతులను ఆదుకోవాలని. లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పండి’ అని ఆయన అన్నారు.
గుడివాడలో మాట్లాడుతూ.. పేకాట క్లబ్లు నిర్వహించడానికి ఉన్న తీరిక ప్రజాపాలన చేయడానికి వైసీపీ ప్రజాప్రతినిధులకు లేదని కొడాలి నానిని తప్పుబట్టారు. కంకిపాడు నుంచి గుడివాడకు వచ్చే రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని, ఇక్కడి ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీయాలని పిలుపిచ్చారు. దాష్టీకం చేసేవారు.. నోటిదురుసు ప్రదర్శించేవారు ఎవరైనా.. జనసేన బలంగా ఎదుర్కొంటుంది’ అని హెచ్చరించారు. ఆయన పంచ్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
