హోరాహోరీ! తొలి రోజే వాడీవేడి
ABN , First Publish Date - 2020-12-01T08:47:57+05:30 IST
సూటి ప్రశ్నలకు సమాధానాలివ్వలేదు! కానీ... మాటలతో దాడులు చేశారు. ఇప్పటిదాకా 18 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు ఏం చేశారన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. పంట పరిహారం బీమా చెల్లిచామంటూ ‘వాస్తవ దూర’ ప్రకటన చేసి...
అధికారపక్షం వ్యూహాత్మక దాడి
ఆనవాయితీని కాదని విపక్షనేత మైక్ కట్
ఆగ్రహంతో పోడియంలోకి బాబు
నిరసన చేస్తున్న విపక్ష సభ్యుల వద్దకు మంత్రులు, ఎమ్మెల్యేలు
రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, మాటలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
సూటి ప్రశ్నలకు సమాధానాలివ్వలేదు! కానీ... మాటలతో దాడులు చేశారు. ఇప్పటిదాకా 18 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు ఏం చేశారన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. పంట పరిహారం బీమా చెల్లిచామంటూ ‘వాస్తవ దూర’ ప్రకటన చేసి... విపక్షానికి దొరికి పోయారు. సోమవారం ప్రారంభమైన శాసనసభ శీతాకాల సమావేశాలు ఊహించనట్లుగానే.. మొదటి రోజే రాజకీయ వేడి రగిలించాయి. వ్యవసాయంపై మంత్రి కురసాల కన్నబాబు ప్రసంగించాక.. దానిపై టీడీపీ అభ్యంతరాలు వెల్లడించేందుకు సిద్ధమైంది. ముందుగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. బీమా ప్రీమియం చెల్లింపులపై ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందని, సమాచార హక్కు చట్టం కింద తన వద్ద అధికారికంగా సమాచారం ఉందన్నారు. అయితే.. ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల రామానాయుడు మాట్లాడాలంటూ సభాపతి స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశించారు. ఆ తర్వాత... పంటల బీమా చెల్లింపుపై టీడీపీ ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. బీమా మొత్తాన్ని డిసెంబరు 15న చెల్లిస్తామని చెబుతున్నా టీడీపీ నేతలకు అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వల్ప వ్యవధి చర్చతో సహా ఇతర చర్చల సందర్భంగా ప్రతిపక్ష నేతకు గౌరమిస్తూ మైక్ను ఇవ్వడం ఆనవాయితీ. చంద్రబాబుకు మైక్ ఇచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి అభ్యంతరంతో కట్ చేశారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికీ ఫలితం లేకపోవడంతో.. అసాధారణ రీతిలో చంద్రబాబు తన సీటుకు ఎదురుగా పోడియం వద్ద బైఠాయించారు. ఆయనకు టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు.
కొందరు మంత్రులు, అధికార పక్ష సభ్యులూ భారీగా పోడియం వద్దకు వచ్చి విపక్ష సభ్యులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఈ క్రమంలో చంద్రబాబు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన చేస్తున్న తమవద్దకు సమీపించిన ఎమ్మెల్యే హఫీజ్ఖాన్పై మండిపడ్డారు. దీనిని అధికారపక్షం ‘అస్త్రం’గా వాడుకుంది. మైనారిటీ ఎమ్మెల్యేను బెదిరించారంటూ ఈ అంశానికి సీఎం మతంరంగు పులిమారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్ పోడియం పైకి ఎక్కడం.. మైకులు విరిచేయడం వంటి సంఘటనలూ జరిగాయి. కానీ.. చంద్రబాబు పోడియం వద్ద బైఠాయించడాన్ని అధికారపక్షం సహించలేకపోయింది. ఎన్నడూ లేనివిధంగా విపక్ష నేతనూ సభ నుంచి సస్పెండ్ చేయడం, ఆయన ప్రవర్తనను తప్పు పడుతూ మరో తీర్మానం చేయడం విశేషం.