‘ఆశా వర్కర్లకు కనీసం మాస్క్లు కూడా ఇవ్వలేదు’
ABN , First Publish Date - 2020-04-26T17:08:18+05:30 IST
ప్రపంచమంతా కరోనా వైరస్కు భయపడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం..

అమరావతి: ప్రపంచమంతా కరోనా వైరస్కు భయపడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అక్కడి ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదంటూ ప్రతిపక్షాలు గత కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఏపీ సీపీఎం నేత రాంభూపాల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో ఆశావర్కర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తున్నామని చెబుతోందని.. అయితే ఆశావర్కర్లకు కనీసం మాస్కులు అయినా అధికారులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్ ఇవ్వకుండా ఆశావర్కర్లను ఇంటింటికి వెళ్లి సర్వే చేయమని అధికారులు చెబుతున్నారని విమర్శించారు.
ఇంటింటి సర్వే చేసినప్పుడు ప్రతి కుటుంబంతో సంతకం చేయించి తీసుకురావాలని ఆశావర్కర్లకు అధికారులు చెబుతున్నారని రాంభూపాల్ అన్నారు. ఆశావర్కర్లు ఇళ్లవద్దకు వెళితే కొంతమంది తలుపులు కూడా తీయని పరిస్థితిని వార్తల్లో చూస్తున్నామన్నారు. ఎందుకంటే వారివద్ద కనీసం రక్షణ పరికరాలు లేవని అన్నారు. అలాగే పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారని, వాళ్లకు ఇప్పటికీ మాస్కులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కొన్ని పంచాయితీల్లో 18 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని, అలాగే మున్సిపాల్టీల్లో మూడు నెలలుగా పెండింగ్ ఉన్నాయన్నారు. వారంతా ఏ విశ్వాసంతో తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవా కార్యక్రమాలు చేయగలరని రాంభూపాల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.