జాతీయస్థాయిలో ఒకే ఒక్కరు!
ABN , First Publish Date - 2020-08-22T08:59:36+05:30 IST
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రం నుంచి ఒకే ఒక్క గురువు ఎంపికయ్యారు.
‘జాతీయ ఉత్తమ టీచర్’ అవార్డ్.. దక్కించుకున్న కాశీబుగ్గ ఇంగ్లిష్ టీచర్
దేశవ్యాప్తంగా 47 మంది గురువుల ఎంపిక
సెప్టెంబరు 5న సత్కారం, అవార్డు అందజేత
న్యూఢిల్లీ/పలాస/కాశీబుగ్గ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రం నుంచి ఒకే ఒక్క గురువు ఎంపికయ్యారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జడ్పీ ఉన్నతపాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్న ఆసపాన మధుబాబు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవవనరుల శాఖ శుక్రవారం ఆయనకు సమాచారం అందించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే గురుపూజోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర ప్రభుత్వం సమున్నతంగా సత్కరిస్తోంది. ఈ ఏడాది ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా 47 మంది ఎంపికయ్యారు. అయితే, ఏపీ నుంచి ఒక్కరే ఎంపిక కావడం గమనార్హం. సెప్టెంబరు 5న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులను అందుకోనున్నారు. అవార్డుతోపాటు రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందించనున్నారు.
గురువుల కుటుంబం:
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన మధుబాబు కుటుంబం మొత్తం ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని కాపుతెంబూరుకు చెందిన మధుబాబు తండ్రి శ్రీరాములు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మధుబాబు సోదరి రమాదేవి టెక్కలిలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె కూడా గత ఏడాది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును అందుకున్నారు. మధుబాబు భార్య తేజేశ్వరి మందసలోని గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. 1995లో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించిన మధుబాబు ఎక్కువకాలం ఉద్దానం ప్రాంతంలో పనిచేశారు.