ఏపీకి జీ ఎంటర్టైన్మెంట్ చేయూత
ABN , First Publish Date - 2020-10-14T22:40:03+05:30 IST
ఏపీకి జీ ఎంటర్టైన్మెంట్ చేయూత

గుంటూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నివారణకు తమ జాతీయ కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీ) తన వంతు సాయంగా ఏపీ ప్రభుత్వానికి అధికారికంగా 10 అంబులెన్సులు, 4,000 పీపీఈ కిట్లను అందించింది. ఈ కార్యక్రమంలో రవాణా, ఐ అండ్ పిఆర్ మంత్రి పేర్ని వెంకట రామయ్య, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్. కే. రోజా, డాక్టర్ మల్లికార్జున, సీఈవో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్ట్, బి. రాజశేఖర్ రెడ్డి, అదనపు సీఈవో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్ట్ సమక్షంలో అంబులెన్సులు, పీపీఈ కిట్లను అందించింది.
కోవిడ్–19తో జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతునందించడానికి జీ కట్టుబడి ఉందని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గోయెంకా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంబులెన్సులు, పీపీఇ కిట్లను అందించిన జీ యాజమాన్యానికి రవాణా, ఐ అండ్ పీఆర్ మంత్రి పేర్ని వెంకట రామయ్య ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ -19 ఉపశమనం కోసం ప్రయతిస్తున్న ఈ సమయంలో మాకు మద్దతు ఇచ్చినందుకు పునిత్ గోయెంకా, జీ ఎంటర్టైన్మెంట్కు ఏపీఐఐసీ చైర్మన్ రోజా ధన్యవాదాలు తెలిపారు. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో త్వరలోనే మనం అందరం గెలవాలని తాను ఆశిస్తున్నానని రోజా అన్నారు.
కోవిడ్–19కు వ్యతిరేకంగా దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలికవసతులను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్త సీఎస్ఆర్ డ్రైవ్లో భాగంగా 240కు పైగా అంబులెన్సులు, 46 వేల పీపీఈ కిట్లు, 90కు పైగా ఆక్సిజన్ హ్యుమిడిఫయర్లు, 6 లక్షలకు పైగా రోజువారీ భోజనాలను అందించడానికి జీ కట్టుబడిందని సంస్థ పేర్కొంది.
ఈ విరాళాన్ని ఈ జాతీయ స్థాయి సీఎస్ఆర్ డ్రైవ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించారు. 3400 మందికి పైగా ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్కు తోడ్పాటునందించారు. ఉద్యోగులు అందించిన మొత్తాలకు సమానమైన మొత్తాన్ని జీ జత చేసి దానిని పీఎం కేర్స్ ఫండ్కు విరాళంగా అందించింది. బాధ్యతాయుతమైన మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ సంస్ధగా, కోవిడ్–19తో పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైన చర్యలను జీ కొనసాగిస్తోందని పేర్కొంది.
