అశ్రునయనాల మధ్య సత్యప్రభ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-11-21T09:35:34+05:30 IST

అశ్రునయనాల మధ్య సత్యప్రభ అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య సత్యప్రభ అంత్యక్రియలు

హాజరైన రాజకీయ ప్రముఖులు


బెంగళూరు, చిత్తూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకురాలు డీకే సత్యప్రభ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య బెంగళూరులో జరిగాయి. ఆమె కొవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ శరీరంలో వివిధ అవయవాలు పనిచేయకపోవడంతో బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. చివరి చూపు కోసం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆమె పార్థీవదేహాన్ని ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉంచారు. అనంతరం వైదేహి ప్రాంగణంలోనే సత్యప్రభ భర్త, మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు సమాధి పక్కన హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించారు. 


రామ్‌చరణ్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు 

ప్రముఖ హీరో చిరంజీవికి బంధువులు కావడంతో ఆయన తరఫున తనయుడు రామ్‌చరణ్‌ తేజ్‌ విచ్చేసి సత్యప్రభ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌, చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.




ఫోన్‌ చేసి ఓదార్చిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు స్వయంగా ఫోన్‌చేసి కుటుంబీకులను ఓదార్చారు. సత్యప్రభ తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేశారని, ఎమ్మెల్యేగా సేవలందించారని అన్నారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు ఆమె భౌతికకాయంపై టీడీపీ జెండా ఉంచి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఏపీ విభాగ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా సానుభూతి తెలియజేశారు.


Updated Date - 2020-11-21T09:35:34+05:30 IST