ఇంటింటి సర్వేతో కట్టడికి యత్నం
ABN , First Publish Date - 2020-03-28T08:54:06+05:30 IST
కరోనా నివారణకు అనుసరించాల్సిన మంత్రం...పరీక్ష...గుర్తింపు...విడిగా ఉంచడం(ఏకాంతం)...చికిత్స చేయడం అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): కరోనా నివారణకు అనుసరించాల్సిన మంత్రం...పరీక్ష...గుర్తింపు...విడిగా ఉంచడం(ఏకాంతం)...చికిత్స చేయడం అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధం చేసేందుకు దేశం మొత్తం ఒక్కటి కావాలని రాష్ట్రపతి కోరారు. ‘వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను గవర్నర్లు ప్రభుత్వాలకు సూచించాలి. ప్రభుత్వ చర్యలకు తోడుగా స్వచ్ఛందసంస్థల సేవలు కూడా తీసుకోవాలి. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి’ అని కోరారు. సామూహిక ప్రార్థనలు చేయకుండా ఉండడం, కరోనా రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మత పెద్దలు అవగాహన కల్పించాలని వెంకయ్యనాయుడు కోరారు.
‘‘గవర్నర్లకు ప్రజా జీవితాల్లో ఉన్న విస్తారమైన అనుభవాన్ని ఉపయోగించి కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వాలకు సూచనలు చేయాలి. రెడ్క్రాస్ సేవలు ఉపయోగించుకోవాలి. నిత్యావసరాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేయాలి’’ అని సూచించారు. విదేశాల నుంచి ఇటీవల వచ్చిన అందరిపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ‘‘విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చినవారిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే చేస్తున్నాం. వారిని గుర్తించి విడిగా ఉంచుతాం. యాచకులు, అనాథలు, ఇళ్లులేని వాళ్లకు ఆహార ఏర్పాట్లకు స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తున్నాయి’’ అని వివరించారు.