ట్రాక్ దాటిన కరోనా
ABN , First Publish Date - 2020-06-11T09:41:00+05:30 IST
కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహం ఇది. రాష్ట్రంలో నిన్నమొన్నటిదాకా ఇదే జరిగింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టెస్ట్, ట్రీట్ బాగున్నా...

ఏపీలో సామాజిక వ్యాప్తి దశ!
అంతుచిక్కని కాంటాక్ట్ ట్రేసింగ్
ఎవరి ద్వారా సోకిందో తెలీని వైనం
వైరస్ లక్షణాలు లేకుండానే
80 శాతం మందిలో పాజిటివ్
‘సెంటినల్’ పరీక్షలతో ముందుకు
ర్యాండమ్గా 200 మందికి
విజయవాడ బీసెంట్ రోడ్డులో గుంపులుగా జనం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
టెస్ట్: కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు చేయడం.
ట్రేస్: ఎవరి ద్వారా వైరస్ సోకింది, ఎవరెవరు ‘కాంటాక్ట్’లోకి వచ్చారో గుర్తించడం.
ట్రీట్: కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించడం!
కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహం ఇది. రాష్ట్రంలో నిన్నమొన్నటిదాకా ఇదే జరిగింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టెస్ట్, ట్రీట్ బాగున్నా... మధ్యలో ఉన్న ‘ట్రేస్’ కష్టంగా మారింది. విదేశీ ప్రయాణ నేపథ్యం లేని, వలస కూలీలు కాని, ఇంట్లో ఎవరికీ వైరస్ సోకని వారూ కొవిడ్-19 బారిన పడుతున్నారు. వీరికి ఎవరిద్వారా వైరస్ సోకిందో తెలియడంలేదు. పది రోజుల క్రితం కొన్ని కేసులను తీసుకుని ట్రాకింగ్(ట్రేస్) చేయాలని నిర్ణయించారు.
ఎన్ని రోజులు ట్రాకింగ్ చేసినా ఆ కేసులకు సంబంధించిన కాంటాక్ట్స్ మాత్రం దొరకడం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు, ఆరోగ్యశాఖ అధికారులు మొన్నటి వరకూ టెస్ట్, ట్రేస్, ట్రీ ట్ అనే విధానాన్ని అమలు చేశారు. ఏదైనా ప్రాంతంలో ఒక వ్యక్తికి కరోనా వస్తే అతని కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా పరీక్షలు చేశారు. ఆ ట్రాకింగ్ ఆధారంగా అతని కాంటాక్ట్ ఎవరు, ఒకవేళ రెడ్జోన్ ప్రాంతంలోకి వెళ్లారా అని ఆరా తీస్తూ... ఆ వ్యక్తి 10 రోజుల హిస్టరీని సేకరించి, అతనికి కరోనా ఎలా వచ్చిందనేది నిర్ధారించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చె ప్పి.. సెంటినల్ సర్వేలెన్స్ అమలు చేస్తున్నారు. అంటే... కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజలకు ర్యాండమ్గా పరీక్షలు చేస్తారు.
షాపింగ్ మాల్స్, ప్ర భుత్వ కార్యాలయాలు, మార్కెటింగ్ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సుమారు 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా అక్కడికి నిత్యం వచ్చేవారిపై దృష్టిపెడతారు. పది మందిలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ అయితే వెంటనే ఆ ప్రాంతాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటిస్తారు. రోజుకు 20 ప్రదేశాలను ఎంపిక చేసుకుని, సుమారు 200 మంది నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది కి లక్షణాలు కనిపించడం లేదు.
ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది! చుట్టు పక్కల ఎవరికైనా కరోనా వచ్చి, లక్షణాలు లేనివారు కూడా అనుమానంతో పరీక్షలు చేయించుకున్నా కొంత మందికే వ్యాధి బయటపడుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో పాజిటివ్ వచ్చిన ఉద్యోగుల్లో చాలామందికి పైకి లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పరిస్థితిని అత్యంత ప్రమాద స్థితిగా ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి అయిందని చెప్పడానికి ఇదొక ఉదాహారణంటున్నారు.