రెట్టింపు స్ఫూర్తితో రాజధాని పోరు

ABN , First Publish Date - 2020-10-07T10:16:17+05:30 IST

రాజధాని అమరావతి ఉద్యమం చేపట్టి ఈ నెల 12కి 300 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో

రెట్టింపు స్ఫూర్తితో రాజధాని పోరు

అమరావతి పరిరక్షణ సమితి రౌండ్‌ టేబుల్‌ భేటీలో నిర్ణయం

300ల రోజుకు చేరువలో ఉద్యమం


విజయవాడ/గుంటూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ఉద్యమం చేపట్టి ఈ నెల 12కి 300 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో రెట్టింపు స్ఫూర్తితో పోరాటాన్ని సాగించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పోరాటానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో విజయవాడలోని ఓ హోటల్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సమితి కన్వీనర్‌ శివారెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు. అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా 11వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు(5కే వాక్‌) నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు వెబినార్‌ నిర్వహిస్తారు. 12న అన్ని రెవెన్యూ కార్యాలయాల ఎదుట నిరసన తెలుపుతారు. అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 22న జాతీయస్థాయిలో మహిళలతో వెబినార్‌ నిర్వహించాలని నిర్ణయించారు.


భూములిచ్చి మాటలు పడుతున్నాం: రాజధాని రైతుల ఆవేదన

‘‘నాడు భూములు తీసుకునేటప్పుడు భోజనం పెట్టి, దుస్తులు పెట్టి గౌరవించారు. ఇప్పుడు దుర్భాషలాడుతున్నారు. రాజధానికి భూములు ఇవ్వడమే నేరంగా ఉంది. ఏం ఖర్మపట్టించారు’’ అని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం మంగళవారానికి 294వ రోజుకు చేరింది. 29 గ్రామాల రైతులు 3 రాజఽధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.

Read more